వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ చార్జ్‌షీట్‌లో ఐదో నిందితుడిగా శివశంకర్‌‌రెడ్డి

  • గతేడాది నవంబర్ 17న హైదరాబాద్‌లో అదుపులోకి
  • ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో శివశంకర్‌రెడ్డి
  • పులివెందుల కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ నిన్న పులివెందుల కోర్టులో రెండో చార్జిషీటు దాఖలు చేసింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఇందులో ఐదో నిందితుడిగా చేర్చింది. గతేడాది నవంబరు 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాతి రోజున పులివెందుల కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

అప్పటి నుంచి ఆయన కడప సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసులో సీబీఐ తాజాగా దాఖలు చేసినది రెండో చార్జ్‌షీట్ కాగా, తుది చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వివేకా డ్రైవర్ షేక్ దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

YS Vivekananda Reddy
Shiva Shankar Reddy
Murder Case
CBI
Chargesheet

More Telugu News